సీతారామం, హాయ్ నాన్న లాంటి క్లాసిక్ హిట్ చిత్రాలలో నటించింది. మృణాల్ ఠాకూర్. ఈ భామకు తెలుగు, తమిళంలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అగ్ర కథానాయికగా ఎదిగేంత అద్భుత నటనాభినయం మృణాల్ ప్రత్యేకత. కానీ ఎక్కడో ఏదో జరుగుతోంది. అదేంటో అర్థం కావడం లేదనేది అభిమానుల ఆవేదన. మృణాల్ కొన్ని వరుస ప్రాజెక్టులకు కమిటైనప్పుడు తనను దెబ్బ తీసేందుకు వెనక నుంచి ఏదో కుట్ర జరుగుతోందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా నెగెటివ్ పీఆర్ తనను దెబ్బ తీసేంత ఘోరంగా ఉందని విశ్లేషిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కెరీర్ను దెబ్బతీసేందుకు ఎవరో కావాలనే కుట్ర చేస్తున్నారనే కోణంలో సోషల్ మీడియాలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో ఎదుగుతున్న సమయంలో వరుసగా ఎదురవుతున్న వివాదాలే దీనికి కారణం. పరిశ్రమ వర్గాల చర్చల ప్రకారం.. మృణాల్ కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు సరిగ్గా ధనుష్ పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. అదే సమయంలో తనకు సంబంధించి పదిహేనేళ్ల నాటి పాత వీడియోలు మళ్లీ బయటకు వచ్చాయి. బిపాసా బసు, అనుష్క శర్మ లాంటి సీనియర్లపై మృణాల్ ఘాటు వ్యాఖ్యలు ఇంటర్నెట్ అంతటా చర్చకు తెర తీసాయి. అయితే ఇదంతా ఉద్దేశ పూర్వకంగా డ్యామేజ్ చేసేందుకు ఎవరో కావాలనే కుట్ర చేస్తున్నారనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. మృణాల్ పై ఎవరో వ్యక్తిగత గ్రడ్జ్ తో ఇదంతా చేస్తున్నారని అందరూ నమ్ముతున్నారు. ఎవరో కావాలనే ఈ నటి ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి పాత వీడియోలను రీ సర్క్యులేట్ చేస్తున్నారని.. ఇది నెగటివ్ పీఆర్ స్ట్రాటజీ అని అభిమానులు వాదిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో ఒక పోస్ట్ లో ఈ పుకార్లను ఫ్రీ పీఆర్ అని మృణాల్ అభివర్ణించారు. "వారు మాట్లాడుకుంటారు.. మనం నవ్వుకుందాం అనే అర్థం వచ్చేలా పోస్ట్ చేసి, తనపై జరుగుతున్న ప్రచారాన్ని లైట్ తీసుకుంటున్నట్లు హింట్ ఇచ్చారు. అలాగే బిపాసా, అనుష్క శర్మలపై తన అభిప్రాయం 19 ఏళ్ల వయసులో అపరిపక్వతతో చెప్పినది అంటూ మృణాల్ వివరణ ఇస్తూ, సీనియర్లకు సారీ కూడా చెప్పారు. అయినా తనపై పుకార్లు ఆగలేదు. సీతారామం, హాయ్ నాన్న వంటి సినిమాలతో మృణాల్ సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిన క్రమంలో తనపై నెగెటివిటీ పెరగడం చాలా సందేహాలకు తావిచ్చింది. ఆమెకు అవకాశాలు పెరగడం వల్ల ఇతర హీరోయిన్ల పీఆర్ టీమ్లు, అలాంటి ఎదుగుదలను ఇష్టపడని వాళ్లు ఈ వివాదాలను సృష్టిస్తున్నారనే పుకార్లు కూడా ఉన్నాయి. ఇటీవల ధనుష్ తో పెళ్లి వార్తలను కొందరు వేగంగా వైరల్ చేసారు. కానీ దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటో సులువుగా కనిపెట్టేసారు అభిమానులు. ధనుష్ వంటి స్టార్ హీరోతో పెళ్లి అంటే సహజంగానే హీరోయిన్ల కెరీర్ అయిపోయిందనే ముద్ర పడుతుంది. ఇప్పుడు 2026 సంవత్సరంలో అడుగుపెట్టాక మరోసారి ధనుష్ తో మృణాల్ పెళ్లి అంటూ ప్రచారం మొదలైపోయింది. ప్రస్తుతం వరుస పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమయంలో ఇలాంటి రూమర్స్ రావడం ఆమె కొత్త సినిమాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. క్రేజీ బ్యూటీ ప్రస్తుతం అడివి శేష్ 'డెకాయిట్' లాంటి పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తోంది.. ఈ ప్రాజెక్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సన్నిహితులు విశ్లేషిస్తున్నారు.