రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం
కేంద్ర నిధులతో నియోజకవర్గాల అభివృద్ధి పై దృష్టి పెట్టండి
రాష్ట్ర అభివృద్ధికి నల్లమల సాగర్, పూర్వోదయ ముఖ్యం
జిల్లాల కలెక్టర్ల సదస్సుకూ ఎంపీల వర్చువల్ హాజరు
టీడీపీ సమావేశంలో ఎంపీలకు సీఎం చంద్రబాబు నిర్దేశం
అమరావతి: రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కీలకంగా ఉండాలనిమన రాష్ట్రానికి ఇంకేం సాదించవచ్చనే దానిపై ఆలోచించి నిధులను రాబట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధికి అవకాశాలు, సమస్యల పరిష్కారాలపై దృష్టి పెట్టాలన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన టీడీపీ సమావేశం జరిగింది. జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు... కేంద్రంతో జరపాల్సిన సంప్రదింపులు వంటి అంశాలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశానికి టీడీపీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు, మంత్రి లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరపడానికి ఎంపీలకు కొన్ని శాఖలను అప్పజెప్పామని.. ఆయా శాఖలకు సంబంధించి ఏపీలో జరుగుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు మంత్రులు, సెక్రటరీలతో మాట్లాడాలని అన్నారు. కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సిన సమయాల్లో ఆయా శాఖలకు సంబంధించి కేంద్రంలో ఉన్న ప్రతినిధులతో మాట్లాడి.. రాష్ట్రానికి మేలు జరిగేలా పనులను, నిధులను సాధించాల్సిన బాధ్యతను ఎంపీలు తీసుకోవాలని సీఎం చెప్పారు. రాష్ట్ర అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ఫిబ్రవరిలో జరిగే కలెక్టర్ల సదస్సులో ఎంపీలు అందరూ వర్చువల్ గా పాల్గొనాలని స్పష్టం చేశారు. వెనకబడిన ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్, పూర్వోదయ పథకం, పోలవరం నల్లమల సాగర్... ఈ మూడింటిని ప్రాధాన్యతాంశాలుగా తీసుకోవాలన్నారు. అలాగే ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ ఈ సెషన్లోనే బిల్లు పెట్టనున్నారని... దీనిపై కేంద్రంలోని సంబంధిత మంత్రి, అధికారులతో టచ్ లో ఉండాలని సీఎం సూచించారు. వీటితో పాటు.. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందనే అంశాలను పార్లమెంటులో వివిధ సందర్భాల్లో ప్రస్తావించాలని సూచించారు. సభలో టీడీపీకి చెందిన ఎంపీలందరూ మాట్లాడాలని, సమస్యలు ఉత్పన్నమైనా పట్టు వదలకుండా ప్రయత్నించాలని ముఖ్యమంత్రి సూచించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్న క్రమంలో ఏపీ ప్రాజెక్టులకు నిధులు కేటాయించేలా చూడాలని ఎంపీలకు సీఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు తాజా అంచనాలు ఇచ్చామని సీఎం సమావేశంలో ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు... ఆర్ అండ్ ఆర్ పూర్తి చేయాలని... దీనికి సంబంధించి రూ.12,000 కోట్లు ఇంకా కేంద్రం నుంచి రావాలని చెప్పారు. 2027 జూన్లో జరిగే గోదావరి పుష్కరాల లోపు పోలవరం నిర్మాణం పూర్తి చేయగలిగితే బావుంటుంది. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన జలవనరుల ప్రాజెక్టులపై పొరుగు రాష్ట్రాలతో వివాదాలు అవసరం లేదని ముఖ్యమంత్రి అన్నారు. నల్లమల సాగర్ వంటి పార్లమెంటులో ప్రత్యక్షంగానైనా.. పరోక్షంగానైనా ప్రస్తావనకు వస్తే ఏపీ వాదనలు గట్టిగా వినిపించాలని సూచించారు. తెలంగాణ కాళేశ్వరం నిర్మించి.. మంజీరాకు నీళ్లను తరలించినా.. ఏపీ అభ్యంతరం చెప్పలేదన్న విషయాన్ని కేంద్రానికి అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ఇదే సందర్భంలో నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో తెలంగాణ అభ్యంతరం చెప్పడం కరెక్ట్ కాదనే అంశాన్ని వివరించాలని సీఎం ఎంపీలకు స్పష్టం చేశారు. ఇక అమరావతి నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయని, రెండో దశ అమరావతి కూడా ప్రారంభం కానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. పూర్వోదయ ప్రాజెక్టు కింద రూ.40 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించామని సీఎం చంద్రబాబు ఎంపీలకు వివరించారు. ఇచ్చాపురం నుంచి తడ వరకు నాలుగు లేన్ల రైల్వే ట్రాక్ వేసేలా చూడాలని చెప్పారు. ముఖ్యంగా రైల్వే శాఖలో ఎక్కువగా నిధులు ఉంటాయని.. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఫ్లైఓవర్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలను రైల్వే శాఖ పెద్ద ఎత్తున చేపట్టేందుకు సిద్దంగా ఉందని... పార్లమెంట్ నియోజకవర్గాల్లో అలాంటివి ఏమైనా ఉంటే... ఆ వనులను గుర్తించి.. నిధులను తెచ్చుకుని పనులు చేపట్టాలని సీఎం ఎంపీలకు సూచించారు. రంగంలో ప్రస్తుతం రెండో స్థానంలో ఏపీ ఉందని.. పీపీపీ పద్దత్తుల్లో ఆస్పత్రుల నిర్మాణం చేపట్టేందుకు, వీజీఎఫ్ కూడా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని చెప్పారు. దీన్ని ప్రతి ఎంపీ దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా వ్యవహరించాలని కోరారు. సభలో కానీ.. క్షేత్ర స్థాయిలో కానీ కూటమి లక్ష్యాలకు విఘాతం కలిగించేలా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవహరించవద్దని సీఎం ఆదేశించారు. విభజన సమస్యలు, జాతీయ రహదారులు విస్తరణ, సాగరమాల ప్రాజెక్టుల్లో చేపడుతున్న పనుల పురోగతిని తెలుసుకోవాలన్నారు. కేంద్రం నుంచి ఏ మేరకు నిధులు రాబట్టవచ్చో చూడాలన్నారు. రాష్ట్రస్థాయి అంశాలే కాకుండా... జాతీయ స్థాయిలో ఎన్డీఏ చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవడంతోపాటు... ప్రతివక్షాలు బీజేపీ పై విమర్శలు చేస్తున్న సమయంలో ధీటుగా సమాధానం చెప్పేందుకు చొరవ చూపాలని సీఎం ఎంపీలకు సూచించారు. మరోవైపు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంపీలు కృషి చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. ఎంపీలు కూడా పార్టీ కార్యాలయానికి తరచూ వస్తుండాలని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ జరుగుతోందని వెల్లడించారు. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఈ విషయం స్పష్టంగా కనిపించిందని చెప్పారు. దావోస్ లో తాను వివిధ సెషన్లలో జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులతో సమావేశమయ్యాయని... వారంతా ఇండియా సరైన మార్గంలో వెళ్తుందని చెప్పడంతో పాటు... ఏపీ అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని ఎంపీలకు లోకేష్ వివరించారు.