సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రయాణికులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని, టోల్ ఫీజుల నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. ఈ నిర్ణయం హైదరాబాద్–విజయవాడ మార్గంలో ప్రయాణించే లక్షలాది మంది పౌరులకు ఉపయోగకరంగా ఉండనుంది.
లేఖలో సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను, గ్రామాలకు వెళ్లే సామాన్య ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను మంత్రి వివరించారు. పండుగ రోజుల్లో టోల్ గేట్ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడం వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయని, దీనివల్ల ఇంధనం వృథా అవ్వడమే కాకుండా ప్రయాణికుల సమయం కూడా నష్టపోతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు, అలాగే తిరుగు ప్రయాణంలో జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ–హైదరాబాద్ మార్గంలో టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
పండుగ రోజుల్లో సాధారణ రోజుల కంటే సుమారు 200 శాతం వరకు ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. టోల్ గేట్ల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, దీనివల్ల ప్రమాదాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులపై మంగళవారం సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి ఆర్అండ్బీ, ఎన్హెచ్ఏఐ, మోర్త్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
జనవరి 8 నుంచే రహదారిపై వాహనాల తాకిడి మొదలవుతుందని అంచనా వేస్తూ, ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద వాహనాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా నేరుగా వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైతే టోల్ వసూళ్లు నిలిపివేసే విధంగా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.
ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ల ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. వైద్య, రెవెన్యూ, పోలీస్, ఆర్అండ్బీ, ఎన్హెచ్ఏఐ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అధికారుల అప్రమత్తతను తాను స్వయంగా పరిశీలిస్తానని, అవసరమైతే పండుగ రోజుల్లో తానే మోటార్ సైకిల్పై హైవేలో తిరుగుతూ పరిస్థితిని సమీక్షిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.