టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (=జదీ) దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లి అప్పుడే రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం తన కసరత్తులు ప్రారంభించాడు. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ ఎడిషన్ కోసం సిద్ధమవుతూ, నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం యూకేలో ఉన్న కోహ్లి, ఇండోర్ నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో కోహ్లి తనదైన శైలిలో పవర్ఫుల్ షాట్లతో అలరించాడు. అతను పూర్తి ఫామ్లో ఉన్నట్లు కనిపించాడు. ఈ పోస్ట్కు "ఐపీఎల్ 2026" అని క్యాప్షన్ జోడించి, పక్కన ఒక ఇనుక గడియారం ఎమోజీని జత చేశాడు. దీంతో రాబోయే సీజన్పై అతను ఎంత సీరియస్ గా ఉన్నాడో అర్థమవుతోంది. కోహ్లి వీడియోను ఆర్సీబీ ఫ్రాంచైజ్ కూడా తమ అధికారిక ఖాతాలో పంచుకుంది. "రన్ మెషిన్ చక్కగా ఆయిల్ వేసినట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ 2026ను ఇప్పుడే మొదలు పెడదాం" అని వ్యాఖ్యానించింది. అంతకుముందు ఆర్సీబీతో కోహ్లికి ఉన్న 18 ఏళ్ల అనుబంధాన్ని పురస్కరించుకుని ఫ్రాంచైజీ ఒక ప్రత్యేక పోస్ట్ చేసింది. "19 సీజన్లు, ఒకే జట్టు, ఒకే లెజెండరీ పేరు. 2008 లో ఒక యువ ఆటగాడిగా వచ్చి, ఇప్పుడు ఫ్రాంచైజీకి ప్రత్యామ్నాయం లేని ఐకాన్ గా ఎదిగాడు. 18 ఏళ్ల క్రితం ఇదే రోజున, అండర్-19 డ్రాఫ్ట్ ద్వారా కోహ్లిని జట్టులోకి తీసుకున్నాం. అదే నిబద్ధత, అదే విధేయతతో ఈ ప్రయాణం కొనసాగుతోంది" అని పేర్కొంది. 2025లో ఆర్సీబీ తన ఐపీఎల్ టైటిల్ కరవును తీర్చుకోవడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. గత సీజన్లో లో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 15 ఇన్నింగ్స్ లో 144.71 స్ట్రైక్ రేట్తో 657 పరుగులు సాధించాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్లో 191 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న ఆర్సీబీ, 6 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో కోహ్లి 35 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. ఇప్పటికే టెస్టులు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి, అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్ రోజే అతను పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.