పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా హరీష్ శంకర్ రాసిన పవర్ఫుల్ డైలాగులకు పవన్ తనదైన శైలిలో గొంతును అందించబోతుండటం హైలైట్గా మారనుంది. ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. వాస్తవానికి ఆ తేదీన విడుదల కావాల్సిన రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం వాయిదా పడటంతో, ఆ స్థానాన్ని 'ఉస్తాద్ భగత్ సింగ్' భర్తీ చేయనున్నట్లు సమాచారం. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది' అంటూ ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమా రేంజ్ను చెప్పకనే చెప్పగా, ఇప్పుడు డబ్బింగ్ పనులు మొదలవ్వడం సినిమా విడుదలకు అడుగులు వేగంగా పడుతున్నాయనే సంకేతాలను ఇస్తోంది.