ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టుకు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నారు. ఐచి-నగోయా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్ కు భారత బృందాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. మొత్తం 768 మంది సభ్యులతో కూడిన భారత బృందంలో 503 మంది క్రీడాకారులు, 246 మంది అధికారులు, సహాయక సిబ్బంది, 19 మంది కంటింజెంట్ సిబ్బంది ఉన్నారు. ఆసియా గేమ్స్ సమయంలో రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు విశ్రాంతి ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్లో భారత్ వైట్బాల్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గంభీర్ కు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో లక్ష్మణ్ భారత పురుషుల జట్టు బాధ్యతలు చేపట్టనున్నారు. లక్ష్మణ్కు సునీల్ జోషి, హృషీకేశ్ కనిత్కర్, శుభదీప్ ఘోష్ సహాయకులుగా వ్యవహరిస్తారు. మహిళల జట్టుకు అమోల్ ముజుందార్ హెడ్ కోచ్గా వ్యవహరించనున్నారు. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ లోనూ లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్గా వ్యవహరించారు. ఇంగ్లాండ్ తో వైట్బాల్ సిరీస్ తర్వాత గంభీరు విశ్రాంతి ఇచ్చిన సమయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆసియా గేమ్స్ భారత పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగనున్నాయి. 2022 హాంగ్ ఆసియా గేమ్స్ లో రెండు జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. అప్పుడు పురుషుల జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించగా.. మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యం వహించారు. మరోవైపు ఆసియా గేమ్స్ క్రికెట్ జట్లకు వసతి ఏర్పాట్లపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో జపాన్ క్రికెట్ సంఘం సీఈవో నవోకి అలెక్స్ మియాజీ కీలక వివరణ ఇచ్చారు. గదుల కొరత ఉన్నప్పటికీ పాల్గొనే జట్లకు హోటల్ వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 3 వరకు టీ20 క్రికెట్ పోటీలు జరగనున్నాయి. జట్లు కోరుకుంటే తమకు నచ్చిన వసతిని స్వయంగా ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉందని మియాజీ చెప్పారు.