హైదరాబాద్లో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బోనాల సంబురానికి ఆడపడుచులు గురువారం శ్రీకారం చుట్టారు. ఆషాఢ మాసంలో తొలి గురువారం గానీ, ఆదివారం గానీ బోనాల సందడి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఆషాఢం మాసం తొలిరోజే గురువారం రావడంతో బోనాల పండగ ప్రారంభించారు. ఆనవాయితీ ప్రకారం గోల్కొండ జగదాంబిక ఆలయం నుంచి బోనాల సంబురాలకు భక్తులు శ్రీకారం చుట్టారు. దీంతో గొల్కొండ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది.
పట్టువస్త్రాలు సమర్పించి తొలిబోనాలు ఎత్తిన స్పీకర్, మంత్రులు
ఆషాఢమాస బోనాల సంబురం సందర్భంగా లంగర్ హౌజ్ చౌరస్తాలో గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరుపున స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా భక్తులతోపాటు నృత్యం చేస్తూ వారిని పొన్నం ప్రభాకర్ ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన , సీపీ సీవీ ఆనంద్ ,కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కూడా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు..
అనంతరం మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఆషాడ మాసంలో హైదరాబాద్లోని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న బోనాల సంబురాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందని అన్నారు. హైదరాబాద్ ప్రజలు వచ్చే భక్తులకు మంచి ఆతిధ్యం ఇచ్చేలా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని సూచించారు. బోనాల పండగ సందర్భంగా మూడు వేల దేవాలయాలకు పండగ కోసం 20 కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. నెల రోజుల పాటు వివిధ ఆలయాల్లో బోనాలు సమర్పిస్తూ రంగం కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. జగదాంబ మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం సంవృద్ధి వర్షాలతో పాడి పంటలతో అందరూ ఆరోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రులు కొండా, పొన్నం తెలిపారు
గోల్కొండలో ఉన్న జగదాంబిక అమ్మవారికి, అలాగే ఎల్లమ తల్లికి బోనలను మహిళలు సమర్పించారు. అలాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన బోనం సమర్పించారు. అలాగే బీజేపీకి చెందిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజంద్ర కూడా అమ్మవారిక బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యావత్ ప్రజానికానికి వారిద్దరు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలంతా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించే భాగ్యం కలగాలని.. జాతరను అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు.
బారులు తీరిన భక్తులు
గోల్కొండ, లంగర్ హౌజ్ చౌరస్తా వద్ద జగదాంబ మహంకాళికి బోనలు సమర్పించడం కోసం భక్తులు బారులు తీరారు. బోనలు సమర్పించి మహిళలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి పంపించారు. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో భక్తులు కాస్తా ఇబ్బందులు పడాల్సి వచ్చింది