రెండ్రోజులు.. పది సెషన్లు రాజకీయాల్లో కొత్త నాయకత్వ విధానానికి శ్రీకారం హాజరుకానున్న చంద్రబాబు, లోకేశ్
అమరావతి: టీడీపీ శ్రేణుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఆ పార్టీ నాయకత్వం తొలిసారిగా 'లీడర్షిప్ కాంక్లేవ్' కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. సోమ, మంగళవారాల్లో రెండ్రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని శిక్షణ, సంభాషణ విధానంలో నిర్వహిస్తారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి ముఖ్యనాయకుల్లో నాయకత్వ పటిమ పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ క్షేత్ర స్థాయిలో టీడీపీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగానే కాంక్లేవ్ నిర్వహణ ప్రణాళికలు రూపొందించారు. తొలిరోజు ఐదు సెషన్లు, రెండో రోజున ఐదు సెషన్లుగా కాంక్లేవ్ జరుగనుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్ హాజరు కానున్నారు. క్షేత్ర స్థాయి యంత్రాంగం, క్యాదర్ సమన్వయం, రాజకీయ స్పందన, నాయకత్వ లక్షణాల వంటి అంశాల్లో నేతల సామర్థ్యాలను మెరుగుపరిచేలా ఈ కాంక్లేవ్ జరుగుతుంది. ప్రభుత్వం- ప్రజలకు వారధిగా పార్టీ నేతలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రత్యర్థి పార్టీల కుట్రలను ఎండగట్టడం వంటి అంశాలపై కీలక చర్చ జరుగనుంది.