'వుష్ప' బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇటీవలే ఎదురైన తుంటి గాయం కారణంగా కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆమె, త్వరలోనే తిరిగి కెమెరా ముందుకు రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంట్లో గడిపిన సరదా క్షణాలను గుర్తుచేసుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు. "త్వరలోనే తిరిగి పనిలోకి వెళుతున్నాను. ఈ సమయాన్ని నేను కచ్చితంగా మిస్సవుతాను" అని రష్మిక తన పోస్టులో రాసుకొచ్చారు. విశ్రాంతి సమయంలో తాను కుటుంబంతో కలిసి ప్రార్థనలు చేయడం, సినిమాలు చూడటం, పజిల్స్ పూర్తి చేయడం, తన పెంపుడు జంతువులతో ఆడుకోవడం వంటి మధురమైన క్షణాలకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. కొద్ది రోజుల క్రితం 'మైసా' అనే తన కొత్త చిత్రం షూటింగ్ సమయంలో రష్మిక తీవ్రమైన తుంటి గాయానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు వైద్యులు విశ్రాంతిని సూచించారు. ఈ విరామం తనకు జీవితం పట్ల కొత్త దృక్పథాన్ని ఇచ్చిందని రష్మిక గతంలో పేర్కొన్నారు. "గతంలో తీరిక లేకుండా పనిచేస్తున్నప్పుడు 'నెమ్మదించడం' అనేది భయంగా అనిపించేది. కానీ ఇప్పుడు విశ్రాంతి తీసుకున్నాక, ఆ హడావిడి జీవితమే భయంగా అనిపిస్తోంది. బహుశా ఇదే జీవితం కావచ్చు" అంటూ ఆమె తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రష్మిక తిరిగి కోలుకుని షూటింగ్కు సిద్ధం కావడం పట్ల ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. "నువ్వు వూర్తిగా కోలుకుని మళ్లీ పనిలో చేరడం చాలా సంతోషంగా ఉంది" "నిన్ను మళ్లీ తెరపై చూసేందుకు ఎదురుచూస్తున్నాం" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ అప్డేడేట్తో ఆమె అభిమానులు తమ అభిమాన నటిని వెండితెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.