అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరో ఇద్దరు అనాథ చిన్నారులకు ఆసరగా నిలిచారు.. పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరినీ తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న పవన్ కల్యాణ్.. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా.. అది చిన్నదయినా.. పెద్దదయినా.. తక్షణం స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా 42 మంది అనాథ చిన్నారులకు తన జీతం మొత్తాన్ని ఆర్థిక సాయం రూపంలో అందిస్తున్న ఆయన.. తాజాగా మరో ఇద్దరు చిన్నారుల బాధ్యతను స్వీకరించారు. పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు రెండేళ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయారు. ఉండటానికి ఇల్లు కూడా లేక ఇబ్బందిపడుతున్న వారి దుస్థితిని పవన్ కల్యాణ్కు వివరిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వీడియో సందేశం పంపారు. ఆ చిన్నారుల వేదన పవన్ కల్యాణ్ని కదిలించింది. ఆ చిన్నారులకు ప్రతి నెలా రూ.5 వేల చొప్పున.. ఇద్దరికీ రూ.10 వేలు అందించాలని తన కార్యాలయ అధికారులని ఆదేశించారు. ఏ ఆధారం లేని చిన్నారులకు తక్షణం ఇల్లు కట్టించి ఇచ్చే ఏర్పాటు చేయాలని సూచించారు. ఇద్దరు చిన్నారులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీల్లో చేర్పించే ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆ బాధ్యతను కాకినాడ జిల్లా కలెక్టర్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అప్పగించారు.