మా కష్టం నిజం.. మా కన్నీళ్లు నిజం.. మా ఉద్యోగం నిజం
100శాతం మెరిట్ ద్వారానే టీచర్లుగా ఎంపికయ్యాం
మాలో 90 శాతం మంది పేద వర్గాలకు చెందినవారే
మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు
విశాఖలో కదంతొక్కిన మెగా డీఎస్సీ ఉపాధ్యాయులు
డీఎస్సీపై ‘అసత్య ఆరోపణల పెట్టె' సంద్రంలో నిమజ్జనం
ఏళ్లతరబడి రాత్రింబవళ్లూ కష్టపడి చదివి మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికయ్యామని డీఎస్సీ-2025 ఉ పాధ్యాయులు పునరుద్ఘాటించారు. దగా డీఎస్సీ అంటూ తమ ఆత్మగౌరవం దెబ్బతినేలా పదేవదే అవమానిస్తూ, మనను బాధపడేలా చేస్తున్న ఆరోపణలకు ఇకనైనా స్వస్తి పలకాలని వారు డిమాండ్ చేశారు. స్వార్ధ రాజకీయాల్లోకి తమను లాగొద్దని హితవు పలికారు. 'మా కష్టం నిజం.. మా కన్నీళ్లు నిజం.. మా ఉద్యోగం నిజం' అంటూ భావోద్వేగంతో నినదించారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలను నిరసిస్తూ 'ఆత్మగౌరవ గర్జన' పేరిట ఆదివారం విశాఖ బీచ్ రోడ్లో డీఎస్సీ-2025 ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వేల మంది ఉపాధ్యాయులు గర్జనకు హాజరయ్యారు. తొలుత బీచ్ రోడ్లో 'విక్టరీ ఎట్ సీ' వద్ద ఉపాధ్యాయులంతా సమావేశమయ్యారు. ఆ తరువాత రెండు కిలోమీటర్ల దూరంలోని ఆర్కే బీచ్ వరకు ఫ్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. బీట్అర్ధచంద్రాకారంలో ఉన్న మెట్లపై నిల్చుని నిరసన తెలిపిన అనంతరం 'డీఎస్సీపై అసత్య ఆరోపణల' పెట్టెను సముద్రంలో నిమజ్జనం చేశారు.
డీఎస్సీ అంటే అర్ధం తెలియనోళ్లూ విమర్శిస్తున్నారు!
డీఎస్సీ అంటే అర్ధం తెలియని వ్యక్తులు కూడా మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఉపాధ్యాయులు మండిపడ్డారు. మెగా డీఎస్సీపై జగన్, వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అన్నారు. 'విక్టరీ ఎట్ సీ' వద్ద, ఆర్కేబీచ్ లో పలువురు ఉపాధ్యాయులు తమ ఆవేదనను పంచుకుంటూ గళం విప్పారు. కరోనా సమయంలో వైన్ షాపుల వద్ద టీచర్లకు డ్యూటీలు వేసిన వ్యక్తులు... ఇప్పుడు డీఎస్సీపై మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. డీఎస్సీ నిర్వహణపై సందేహాలుంటే అసెంబ్లీలో చర్చించుకోవాలని సూచించారు. క్రీడా కోటా అభ్యర్ధులు కూడా డిగ్రీ, పీజీ, బీఈడీ పూర్తిచేశారని, అలాగే టెట్లో అర్హత సాధిస్తేనే ఉద్యోగాలు ఇచ్చారని స్పష్టం చేశారు. అక్కడ కూడా మెరిట్న ప్రామాణికంగా తీసుకుని ఉ పాధ్యాయులగా ఎంపికచేశారని పేర్కొన్నారు.
150 రోజుల్లో డీఎస్సీ... 16 వేల కుటుంబాల్లో వెలుగులు
మెగా డీఎస్సీలో ఎంపికైన 16వేల మంది ఉ పాధ్యాయుల్లో 90శాతం మంది పేద, సామాన్య కుటుంబాల నుంచి వచ్చినవారేనని, కాళ్లకు సరైన చెప్పులు కూడా లేని తాము, రూ. లక్షలు పోసి ఉ పాధ్యాయ పోస్టులు కొనుగోలు చేయగలమా? అని సూటిగా ప్రశ్నించారు. ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాల్లోని కోచింగ్ కేంద్రాల్లో తర్పీదుపొంది తిరిగి ఇళ్లకు వచ్చిన తరువాత రేయింబవళ్లు నిద్రాహారాలు మాని డీఎస్సీకి సన్నద్ధమై ఉపాధ్యాయులుగా ఎంపికయ్యామని అన్నారు. దగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందారంటూ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం మంచిది కాదని పరోక్షంగా వైసీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. గత ప్రభుత్వంలో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఐదేళ్లపాటు నిరీక్షించామని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 150 రోజుల్లో మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని అన్నారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, విద్యా శాఖామంత్రి లోకేశ్లు తమ కుటుంబాల్లో వెలుగులు ప్రసాదించారని కృతజ్ఞతలు చెప్పుకొన్నారు.
పేకాటకు, బ్రిడ్జ్ గేమ్కు తేడా తెలియని నేతలు!
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హారిజాంటల్ రిజర్వేషన్ల అమలు కోసం జగన్ సీఎంగా వున్నప్పుడు 2023లోనే జీవో 77 తీసుకువచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా డీఎస్సీని నిర్వహించకపోవడంతో హారిజాంటల్ రిజర్వేషన్లపై అవగాహన లేదన్నారు. పేకాటకు, బ్రిడ్జి గేమ్కు తెలియని వ్యక్తులు కూడా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. డీఎస్సీ పేపరు లీకైందని చెబుతున్న వైసీపీ నేతలకు వరీకి నేతలకు, పరీక్షలన్నీ ఆన్లైన్లో జరిగిన విషయం తెలుసా? అని నిలదీశారు. ఆన్లైన్లో రోజుల తరబడిగా జరిగిన పరీక్షలలో ఒక పూట పరీక్షకు మరోపూట పరీక్షకు ప్రశ్నలు వేర్వేరుగా ఉంటాయని తెలియనోళ్లు కూడా ఆరోపణలు చేస్తున్నారని అని మండిపడ్డారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతల అసత్య ఆరోపణలను కర్నూలులోని కొండారెడ్డి బురుజుకు వేలాడిదీశామని, అనంతరం విజయవాడలో అంబేడ్కర్ సాక్షిగా పాతిపెట్టామని, అరుంధతి సినిమాలో పశుపతి మిగిలిన అవశేషంలా ఇంకా దగా డీఎస్సీ అంటూ చేస్తున్న అసత్య ఆరోపణల పెట్టెను విశాఖలో బంగాళాఖాతంలో కలిపేస్తున్నామని ఉపాధ్యాయులు ప్రకటించారు.