గతంలో అధికారం ఇస్తే ఏం చేశావు రుషికొండను బోడిగుండు చేశావు
మద్యం నిషేధం పేరుతో ఏరులై పారించావ్
వైఎస్ జగన్ పాదయాత్ర ప్రకటనపై మండిపడ్డ షర్మిల
విజయవాడ : జగన్ పాదయాత్ర ఇప్పుడు ఎందుకు... అధికారం కోసమే కదా అని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. అధికారం ఇస్తే.. జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రకటనపై వైఎస్ షర్మిల స్పందించారు. వైఎస్సార్ జలయజ్ఞం పేరుతో చేపట్టిన ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్... ఆ తర్వాత వాటిని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల మాట్లాడారు. మద్యం మాఫీ అన్న వ్యక్తి... మద్యాన్ని ఏరులై పారించి, నకిలీ మద్యంతో రూ.కోట్లు గడించారని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. 'రిషికొండ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బోడి గుండు అయ్యింది. జగన్కు అధికారం ఇస్తే.. ప్రజలకు ఏం చేశారు. ప్రజల్లో ఉన్నారా, కనీసం వారి నాయకులకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారా..?. సీఎంగా అసలు జనాల్లోకి ఆయన ఎప్పుడు వచ్చారు. ఎన్నికలకు ముందు సిద్ధం సభలతో హడావుడి చేశారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే జగన్ ఏం చేద్దామని అనుకుంటున్నారు. ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే.. ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అని అబ్రహం లింకన్ అన్నారు. అధికారంలో ఉన్న జగన్ పని తీరు మనమంతా చూశాం' అని వైఎస్ షర్మిల విమర్శించారు. జగన్కు అధికారం సూట్ కాలేదు.. ఆయన నైజం మారాలి.. ఆయనలో మార్పు రావాలని షర్మిల అన్నారు. 'జగన్ స్వార్థం తగ్గి ప్రజలకు సేవ చేసే గుణం రావాలి. అప్పటి వరకు దేవుడు కరుణించడు.. ప్రజలు కూడా ఆదరించరు. 2027 జూలైలో జగన్ పాదయాత్ర చేస్తే.. ఇప్పుడు ఎందుకు ప్రకటన చేయడం. మేము ఇప్పుడు యాత్ర చేస్తున్నాం కాబట్టి ప్రకటించాం. జగన్ ఉపాధి హామీ పథకం కోసం, కూలీల కోసం యాత్ర ఎందుకు చేయడం లేదు. మండ్రేగా కోసం మేము కూలీలకు అండగా నిలిచాం. జగన్ పాదయాత్ర ఎందుకోసం, ఎవరి కోసం.. ప్రయోజనం ఏంటో చెప్పాలి' అని వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.