బ్రాండ్ ఏపీకి ప్రపంచ ఖ్యాతి
దావోస్ పర్యటనతో ఏపీ బ్రాండింగ్ పెరిగిందన్న చంద్రబాబు
పలువురు గ్లోబల్ పారిశ్రామిక వేత్తలతో సమావేశం
పెట్టుబడులపై పెరిగిన ఆసక్తి అని వెల్లడి
రాష్ట్రంలో కీలక ప్రాజెక్టుల పురోగతిపై చర్చలు
అమరావతి: దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తన పర్యటన విజయవంతమైందని, ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ను ప్రోత్సహించేందుకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నాలుగు రోజుల పర్యటనను ముగించుకుని గురువారం ఆయన ఈ విషయాలను వెల్లడించారు. మారుతున్న ప్రపంచ పారిశ్రామిక రంగంలోని ధోరణులను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాల దృక్పథాలను అర్ధం చేసుకోవడానికి ప్రపంచ ఆర్థిక వేదిక ఒక బలమైన వేదికగా నిలుస్తుందని ఆయన అభిప్రాయ పడ్డారు. గత మూడు రోజులుగా జరిగిన వివిధ సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయం, పర్యాటకం వంటి కీలక రంగాల్లో రాష్ట్రం సాధించిన విజయాలను, ప్రగతిని సమ-ర్దవంతంగా ప్రపంచానికి తెలియజేశామని ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలు భారత్పై అధిక ఆసక్తి చూపుతున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశంలో ఉన్న యువశక్తి, సమర్థవంతమైన నాయకత్వం, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాల కారణంగా అన్ని రంగాల్లోనూ కంపెనీల స్థావనకు అవకాశాలు గణనీయంగా పెరిగాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సానుకూల వాతావరణాన్ని అందిపుచ్చుకుని ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తన పర్యటన సాగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్నంలోని టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ పురోగతి, అమరావతిలో ప్రతిపాదిత క్వాంటం వ్యాలీ, కర్నూలులో ప్రతిపాదించిన సౌర విద్యుత్ ప్రాజెక్టులపై ఫలవంతమైన చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో సాంకేతిక, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత చురుకుగా పాల్గొన్నారు. ఆయన మొత్తం 36కు పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. ఇజ్రాయెల్, యూఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో మూడు కీలక సమావేశాలు నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రాంగణంలో 16 మంది ప్రపంచ స్థాయి పారిశ్రామిక దిగ్గజాలతో ముఖాముఖి సమావేశమయ్యారు. అలాగే, తొమ్మిదికి పైగా సెషన్లు, ఇతర సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశాలు రాష్ట్రానికి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడంలో దోహదపడతా యని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను ప్రపంచ వ్యాప్తంగా మరింతగా ప్రచారం చేసేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ విధానాల ప్రభావాన్ని అంచనా వేయడంలో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కీలకపాత్ర పోషించిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తన పర్యటన సందర్భంగా, యూరప్ లో నివసిస్తున్న తెలుగు ప్రవాసుల తో ప్రత్యేకంగా సమావేశమై వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. దావోస్ సదస్సు వేదికగా పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచానికి వివరించారు. మొత్తం మీద, ఈ పర్యటన రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేయడమే కాకుండా, భవిష్యత్ పెట్టుబడులకు బలమైన పునాది వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.