ఈ ఏడాది భారత క్రికెట్ జట్టుకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వైట్ బాల్ క్రికెట్ లో దుమ్మురేపిన భారత జట్టు.. టెస్ట్ క్రికెట్ లో మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఆసియాకప్ 2025ను భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ను సమం చేసుకున్న భారత జట్టు.. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్లో క్లీన్ స్వీప్ అయ్యింది. ఈ ఓటమి ఈ ఏడాది భారత జట్టుకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన కోహ్లి, రోహిత్ శర్మలు.. వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగారు. ఒక్క ఫార్మాట్లోనే ఆడినా.. అద్భుత ప్రదర్శన కనబర్చారు. అయితే టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఈ ఏడాది భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాడిగా అభిషేక్ శర్మ పేరును సూచించాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా అభిషేక్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు. అతను టీమిండియా తదుపరి ఎక్స్ ఫ్యాక్టర్ ఆటగాడని తెలిపాడు. అభిషేక్ శర్మ వన్డే ఫార్మాట్లో ఆడితే చూడాలని ఉందని కూడా చెప్పాడు. 'ఈ ఏడాది భారత క్రికెట్లోకి కేవలం అభిషేక్ శర్మ మాత్రమే రాలేదు. భారత క్రికెట్ తుదపరి తరం ఎక్స్ ఫ్యాక్టర్ ఆటగాడు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే.. అది కచ్చితంగా అభిషేక్ శర్మనే. అతను ఈ ఏడాది అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తన విధ్వంసంతో భారత జట్టు పవర్ ప్లే బ్యాటింగ్ శైలినే మార్చేసాడు. అతని ప్రదర్శన అసాధారణంగా ఉంది. అతను వన్డే ఫార్మాట్లో ఆడితే చూడాలని ఉంది. బహుషా అతను ఈ ఏడాది పురుషుల టీమ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలుస్తాడని నేను భావిస్తున్నా.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో మాత్రమే టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అభిషేక్ శర్మ.. 21 మ్యాచ్ల్లో 42.95 సగటు, 193.46 స్ట్రైక్ రేట్ తో 859 పరుగులు చేశాడు. ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. భారత గెలిచిన ఆసియా కప్ 2025 జట్టులో కూడా అభిషేక్ శర్మ సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్లో 200 స్ట్రైక్ రేట్ తో 214 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.