అభిషేక్ శర్మపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసల జల్లు
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసల జల్లు కురిపించాడు. యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కంటే అభిషేక్ శర్మ విధ్వంసకరమైన ఆటగాడని కొనియాడాడు. గేల్ క్రీజులో సెట్ అయ్యేందుకు సమయం తీసుకునేవాడని, కానీ అభిషేక్ శర్మ ఎదుర్కొన్న తొలి బంతి నుంచే దూకుడుగా ఆడుతాడని తెలిపాడు. న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. తొలి టీ20లో కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక శర్మ.. రెండో మ్యాచ్లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగి వారిని ఊపిరి పీల్చుకోనిచ్చాడు. మూడో టీ20లో మళ్లీ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది భారత్ తరఫున ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా అభిషేక్ శర్మ గురించి మాట్లాడిన మహమ్మద్ కైఫ్ అతన్ని ఆకాశానికెత్తాడు. 'సాధారణంగా దూకుడుగా ఆడే ఆటగాళ్లు నిలకడగా రాణించలేరు. నేను చాలా మంది బిగ్ ప్లేయర్లను గమనించాను. క్రిస్ గేల్ ఇలాగే పెద్ద పెద్ద షాట్లు ఆడేవాడు. కానీ అతను చాలా తెలివిగా బ్యాటింగ్ చేసేవాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకునేవాడు. అందుకోసం అవసరమైతే మెయిడిన్ ఓవర్లు కూడా ఆడేవాడు. ముఖ్యంగా బెంగళూరు వంటి పిచ్లపై చాలా స్లోగా బ్యాటింగ్ ప్రారంభించేవాడు. ఆ తర్వాతే వేగం పెంచేవాడు. కానీ అభిషేక్ శర్మ అతనికి పూర్తి విరుద్ధం. గేల్లా అతను క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకోడు. వచ్చిరావడంతోనే భారీ షాట్లు ఆడుతాడు. అలా బ్యాట్తో భారీ షాట్లు ఆడే బ్యాటర్లలో నిలకడ ఉండదు. కానీ అభిషేక్ శర్మ మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. ప్రతీ మ్యాచ్లో తన సత్తా ఏంటో నిరూపించుకుంటున్నాడు. కేవలం 12, 14 బంతులే ఆడుతున్నా.. 60 నుంచి 70 పరుగులు రాబడుతున్నాడు. అదే అతన్ని మ్యాచ్ విన్నర్గా నిలబెడుతుంది. అప్కమింగ్ టీ20 ప్రపంచకప్ 2026లో అభిషేక్ శర్మ చెలరేగితే టీమిండియానే విజేతగా నిలుస్తుంది.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు. అభిషేక్ శర్మ విధ్వంసం, టీమిండియా అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ ఐదు టీ20ల సిరీస్ ను టీమిండియా 3-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగో మ్యాచ్ వైజాగ్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ఈ మైదానంలో అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీ చూసేందుకు ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు.