ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ తన సినీ జీవితంలో తనకు అండగా నిలిచే ఇద్దరు హీరోల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తాను మనసు బాగోలేనప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు తనను ఓదార్చే స్నేహితులు ఇండస్ట్రీలో ఉన్నారని తెలిపారు. వారిలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఉన్నారని వెల్లడించారు. తాను బాధలో ఉన్నప్పుడు గుర్తుకొచ్చే మొదటి పేరు దుల్కర్ సల్మాన్దేనని అనుపమ అన్నారు. "నేను ఎప్పుడు డల్గా ఉన్నా, దుల్కర్ నుంచి నాకు ఒక మెసేజ్ వస్తుంది. నేను బాధలో ఉన్న విషయం ఆయనకు ఎలా తెలుస్తుందో అని ఆశ్చర్యపోతాను. ఆయనతో కాసేపు మాట్లాడితే నా బాధ అంతా మాయమైపోతుంది" అని ఆమె వివరించారు. దుల్కర్ తర్వాత, తాను ఎక్కువగా విశ్వసించే మరో వ్యక్తి టాలీవుడ్ హీరో రామ్ అని అనుపమ తెలిపారు. వీరిద్దరితో ఉన్న స్నేహబంధం తనకెంతో విలువైందని ఆమె పేర్కొన్నారు. గతంలో అనుపమ, దుల్కర్ కలిసి మలయాళ చిత్రం 'జోమోంటే సువిశేషంగళ్'లో నటించిన విషయం తెలిసిందే. ఇదే సందర్భంగా, తన గత ప్రేమ సంబంధంలో ఎదుర్కొన్న మానసిక వేధింపుల (నార్సిసిస్టిక్ అబ్యూజ్) గురించి కూడా ఆమె ప్రస్తావించారు. అలాంటి వ్యక్తులు ఇతరులను ఎప్పుడూ తమ నియంత్రణలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తారని, ఇది చాలా నిశ్శబ్దంగా జరిగే వేధింపు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.